Wednesday 19 August 2015

మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దు

మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దు
రాజధాని భూసేకరణపై పవన్‌ మరోసారి ట్వీట్

హైదరాబాద్‌, ఆగస్టు 19 : మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కోవద్దని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని భూముల సేకరణపై పవన్‌కల్యాణ్‌ మరో సారి ట్విట్టర్‌లో స్పందించారు. మరోసారి చంద్రబాబు ఆలోచించాలని కోరారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడితోపాటు నదికి సమీపంలో ఉన్న గ్రామాలను భూసేకరణ నుంచి మినహాయించాలని పవన్‌ కోరారు. పాలకులు రైతుల పట్ల వివేచనతో మెలగాలని కోరారు. అభివృద్ధి కోసం జరిగే నష్టం ఎంత కనిష్టమైతే ఆ పాలకులు అంత వివేకవంతులని ఆయన వ్యాఖ్యానించారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణాన్ని కాపాడాలని పవన్‌ కోరారు.

జపాన్‌ తరహాలో ఏపీలో ఓడరేవుల అభివృద్ధికి చర్యలు

నెల్లూరు : జపాన్‌ తరహాలో ఏపీలో ఓడరేవుల అభివృద్ధికి చర్యలు - రాష్ట్ర శాసనసభా స్పీకర్‌ కోడెల
 పులికాట్‌, ఆగస్టు 19 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి విస్తారమైన సముద్రతీర ప్రాంతం ఉందని, జపాన్‌ తరహాలో ఓడరేవులను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాసనసభా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అసెంబ్లీ అభివృద్ధి కమిటీతో కలిసి కోడెల రెండో రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. పులికాట్‌ సరస్సుతోపాటు అటకానితిప్పలో ఉన్న పర్యావరణ విజ్ఞానకేంద్రాన్ని కోడెల బృందం సందర్శించింది. ఏపీ, తమిళనాడు రాష్ర్టాల మధ్య పులికాట్‌ సరస్సు సరిహద్దుల విషయంలో ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పారు. పులికాట్‌లో పేరుకుపోయిన పూడికను తొలగించడంపై సభలో చర్చిస్తామన్నారు. 

తెలంగాణకు ఏమిటి.. కేంద్రంపై ఒత్తిడి పెంచనున్న కేసీఆర్ సర్కారు

తెలంగాణకు ఏమిటి.. కేంద్రంపై ఒత్తిడి పెంచనున్న కేసీఆర్ సర్కారు

బిహార్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వంలోనూ సరికొత్త ఆశలకు తెర తీసింది. తమది కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రమేనని, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమకూ ప్రత్యేకంగా ప్యాకేజీ, రాయితీలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చాలా రోజులుగా కోరుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలనూ అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రులు సైతం తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు సైతం ప్యాకేజీ సాధించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఏయే రంగాల్లో ఎన్నెన్ని నిధులు అవసరం.. ఎక్కడెక్కడ కేంద్ర సాయాన్ని తాము కోరుతున్నదీ వివరిస్తూ ప్రత్యేక నివేదికలు సిద్ధం చేసే పనిని మొదలెడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి కేంద్రం తెలంగాణను ఏ మేరకు ఆదుకుంటుందో? ఎంత ప్యాకేజీ ప్రకటిస్తుందో వేచిచూడాలి.

‘ఆంధ్రావాడివి... నీకిక్కడేం పని’’ అంటూ అవమానించారు:

‘‘ఆంధ్రావాడివి... నీకిక్కడేం పని’’ అంటూ అవమానించారు: రాజీవ్‌శర్మపై ఏపీ డీఐజీ ఫిర్యాదు

విభజన వివాదాల్లో తాజా అంకం
హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య విభజన వివాదాల్లో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. తనను అవమానించారంటూ ఏపీ డీఐజీ ఒకరు ఏకంగా తెలంగాణ సీఎస్‌పైనే ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి మూల బిందువు హైదరాబాద్‌ శివార్లలోని హిమాయత్‌సాగర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడెమీ. అప్పాగా పిలిచే దీనిని, మూడు దశాబ్దాల కిందట ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇక్కడికి తరలించారు. సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాల పోలీసులకూ ఇక్కడే శిక్షణ ఇచ్చేవారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పాను పదో షెడ్యూల్‌లో చేర్చారు. ఇరు రాష్ట్రాలూ పదేళ్లపాటు దీన్ని ఉపయోగించుకోవచ్చని చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నాటికి ఏపీ కేడర్‌కు చెందిన అదనపు డీజీ మాలకొండయ్య అప్పాకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన కొనసాగుతుండగానే, విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడెమీ పేరును తెలంగాణ పోలీస్‌ అకాడెమీగా మార్చి ఈశ్‌కుమార్‌ను డైరెక్టర్‌గా నియమించింది. అప్పాలో ఒక డీఐజీ స్థాయి పోస్టు ఉంది. విభజనకు పూర్వం నుంచి ఏపీ కేడర్‌కు చెందిన వెంకటేశ్వర్‌రావు ఆ పోస్టులో ఉన్నారు. అయితే, ఆయనను రిలీవ్‌ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 25వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. పరిమళ నూతన్‌ అనే అధికారిని ఆయన స్థానంలో నియమించింది. కానీ, తాను ఏపీ కేడర్‌కు చెందిన అధికారినని, తెలంగాణ ప్రభుత్వం తనను ఎలా రిలీవ్‌ చేస్తుందనే కారణంతో వెంకటేశ్వరరావు రిలీవ్‌ కాలేదు. తెలంగాణ అధికారికి చార్జి ఇవ్వడానికి నిరాకరించారు. అదే సమయంలో గత నెలలో పదో షెడ్యూలులోని సంస్థలపై సచివాలయంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అప్పా తరఫున వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఆ సమావేశంలో, ‘‘ఏమయ్యా... నువ్వెందుకు రిలీవ్‌ అవలేదు? ఆంధ్రా వాడివి నీకిక్కడేం పని? అని తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ నలుగురిలో కోప్పడ్డారు. పలువురు ఐఏఎస్‌ల ముందే నన్ను అవమానించారు’’ అని వెంకటేశ్వర్‌రావు ఏపీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పా పదో షెడ్యూలులో ఉన్నందున.. ఇరు రాష్ట్రాల పోలీసులకూ అందులో శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నందున.. తానే కొనసాగుతానని సీ ఎస్‌కు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆగస్టు మూడో తేదీన వెంకటేశ్వరరావు పేరును అప్పా రికార్డుల నుంచి తొలగించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా వందనానికి అప్పాకు వెళ్లిన వెంకటేశ్వరరావుతో.. మూడో తేదీనే రిలీవ్‌ చేసేశామని, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగడంతో ఆయనకు విషయం తెలిసింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని ఏపీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏపీ డీజీపీ రాముడిని కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని డీజీపీ కోరడంతో సదరు డీఐజీ వివరంగా రాసిచ్చారు. అనంతరం ఆయన ఇదే విషయాన్ని ఏపీ సీఎస్‌, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అప్పాలోనూ, పోలీసు ఉన్నతాధికార వర్గాల్లోనూ ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్ర ప్రదేశ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ విషయంలోనూ తెలంగాణ పోలీసులు ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారని ఏపీ సీనియర్‌ ఐపీఎస్‌లు రాముడు దృష్టికి తెచ్చారు. వీటిపై ఆయన పలువురు ఉన్నతాధికారుల అభిప్రాయాలు కోరగా... ‘‘అప్పాతోపాటు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో మన వాటా 58 శాతం తీసుకుందాం. పక్కనే ఏర్పాటు చేసుకుందాం’’ అనే సూచనలు వచ్చినట్టు తెలిసింది. దీంతో పరిష్కార మార్గాలపై రాముడు ప్రభుత్వ సలహాదారు గాంధీ, ఇతర అధికారులతో సమీక్షించినట్టు సమాచారం. కాగా ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎస్‌, ప్రభుత్వ వర్గాల స్పందన తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Tuesday 18 August 2015

ఏపీకి ఎంత?.. రేపే ప్రధానితో చంద్రబాబు భేటీ

ఏపీకి ఎంత?.. రేపే ప్రధానితో చంద్రబాబు భేటీ

  •  ప్యాకేజీ ఎంత కావాలో చెప్పాలంటున్న కేంద్ర సర్కారు
  •  బిహార్‌కన్నా రెండింతలు ఎక్కువే ఇవ్వాలంటున్న ఏపీ
  •  నేడు ఆర్థికశాఖతో సీఎం సమీక్ష
  • ముసాయిదాకు తుది రూపుపై చర్చ
న్యూఢిల్లీ, ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి): బిహార్‌ వంతు పూర్తయింది. ఇక ఏపీ వంతు తేలాల్సి ఉంది. ఊహకందనిరీతిలో బిహార్‌కు భారీ ఎత్తున రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించాల్సిన ప్యాకేజీపై దృష్టి సారించినట్లు సమాచారం. విభజన సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి కచ్చితంగా బిహార్‌కన్నా మిన్నగానే ప్యాకేజీ అందుతుందని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో 20వ తేదీన ప్రధానితో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బిహార్‌తో ఏపీని పోల్చకుండా, ఏపీకి హోదాపై నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరనున్నారు. ముందుగా ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తే, బిహార్‌కు ప్రకటించిన ప్యాకేజీ కన్నా భిన్నమైన, రెండింతలు ఎక్కువ ప్యాకేజీని ప్రకటించాలని మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా విభజన జరిగిన నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని పట్టుబట్టనున్నారు. బిహార్‌ ప్యాకేజీలో.. కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రాష్ట్రానికి ఇచ్చే నిధులనూ కలిపేశారు. అలా కాకుండా 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మొత్తాన్ని మినహాయించి ఉత్తరాఖండ్‌ మోడల్‌ ప్యాకేజీ, హోదాను కల్పించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. ప్రధానితో భేటీలో ప్యాకేజీపై సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చిన తర్వాత ప్రధాని స్వయంగా ఏపీకి వచ్చి ప్రకటన చేస్తారని సమాచారం. అక్టోబర్‌ 22వ తేదీన నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ రానున్నారు. అప్పుడే ఏపీ ప్యాకేజీపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు బీజేపీ సీనియర్‌ నేతలు చెబుతున్నారు. ప్యాకేజీకి సుముఖంగా ఉన్న కేంద్రం హోదా అంశంలో మాత్రం చంద్రబాబుకు నచ్చజెప్పాలని భావిస్తోంది. నీతి ఆయోగ్‌లో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని సీఎంల సబ్‌కమిటీ పరిశీలిస్తున్నదని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే హోదా అంశాన్ని తేల్చుతామని చంద్రబాబుకు నచ్చజెప్పాలని కేంద్రం భావిస్తోంది. అయితే, చౌహాన్‌ కమిటీ సిఫారసుతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబు మోదీపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్శదర్శి పి.వి.రమేశ్‌ ఏపీ అవసరాలు, ప్యాకేజీలో చేర్చాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీకి రెండు మూడు సార్లు వచ్చి కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో భేటీ అయ్యారు. ప్యాకేజీపై రెండు ముసాయిదాలను సిద్ధం చేసినట్లు సమాచారం. బుధవారం సీఎం చంద్రబాబుతో పీవీ రమేశ్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్యాకేజీ ముసాయిదాపై చర్చించి తుది రూపు ఇవ్వనున్నారు. మరోవైపు కేంద్రం కూడా 14 నెలల కాలంలో శాఖలవారీగా ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలను తయారు చేసే పనిలో నిమగ్నమైంది.
 
ఉత్తరాఖండ్‌ మోడలే కావాలి
ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ను విభజించిన సమయంలో ఆ రాషా్ట్రనికి ఇచ్చిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ లాంటిదే ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు గట్టిగా కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదాతోపాటు ఐదు రకాల పారిశ్రామిక రాయితీలను కల్పించారు. రాయితీలన్నీ పదేళ్లపాటు అమలులో ఉంటాయని ప్రకటించారు. పరిశ్రమలకు 100 శాతం ఆదాయపన్ను మినహాయింపు, సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను మినహాయింపులతో పాటు...ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు పూర్తిగా సర్వీస్‌ ట్యాక్స్‌ మినహాయింపులను ఇచ్చారు. అంతేకాకుండా పరిశ్రమలకు ప్రతియేటా బీమా ప్రీమియంలను కూడా కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్‌ చేసింది. పరిశ్రమలు బ్యాంకుల్లో మూలధనం నిమిత్తం తీసుకున్న రుణాలకు 3శాతం వడ్డీని కూడా మాఫీ చేసింది. ఈ మినహాయింపులన్నిటినీ ఏపీకి కూడా వర్తింపజేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నారు. దీంతోపాటు ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ యథాతథంగా అమలు చేయాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేయనున్నారు. హైదరాబాద్‌ను వదులుకోవడం వల్ల వచ్చిన నష్టాన్ని కూడా ప్యాకేజీలో చేర్చాలని డిమాండ్‌ చేయనున్నారు. అక్కడున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఏపీలో ఏర్పాటు చేయాలని, అలా కాని పక్షంలో ఏపీకి అందుకు తగ్గట్టుగా నష్టపరిహారం ఇవ్వాలని కోరనున్నారు. కాగా, ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలకు పన్నుల మినహాయింపులు ఇవ్వడం కష్టమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2016 ఏప్రిల్‌ నుంచి జీఎస్టీ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుందని అప్పుడు దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉంటుందని, సర్వీస్‌ ట్యాక్స్‌లు, ఇతరట్యాక్స్‌లు ఏమీ ఉండవని కేంద్రం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారో గురువారం తేలనుంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

వికీపీడియా నుండి
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
Uyyalavada narasimha reddy.jpg
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
జననంఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కర్నూలు జిల్లాలోని రూపనగుడి
మరణం1847 ఫిబ్రవరి 22
మరణ కారణముఉరిశిక్ష
ఇతర పేర్లుఉయ్యాలవాడ నరసింహారెడ్డి
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు
భార్య / భర్తముగ్గురు భార్యలు. పెద్దభార్య సిద్దమ్మ
పిల్లలుదొర సుబ్బయ్య
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరి లో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు.

ప్రారంభ చరిత్ర[మార్చు]

18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు.నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.
ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడు గా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సంజమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.
నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరుగుళ్లదుర్తికొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.
నరసింహారెడ్డి తల్లి ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య వలన ఒక కూతురు, మూడవ భార్య వలన ఇద్దరు కుమారులు జన్మించారు.

తిరుగుబాటు ప్రారంభం[మార్చు]


నరసింహారెడ్డి సేన వాడిన ఫిరంగి -కొత్తకోట (గిద్దలూరు) గ్రామం వద్ద ఉన్నది

నరసింహారెడ్డి సేన తమ ఫిరంగిలో వాడిన ఇనుప గుండు
1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి,మునగాలజటప్రోలుపెనుగొండఅవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.

1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి,ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు.ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.

తరువాత జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది.

వీరమరణం[మార్చు]

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.[1]
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

ఒక పాట[మార్చు]

అతనిని గురించి కోలాటం పాట తూమాటి దోణప్ప సేకరించినది.
దొరవారి నరసిం హ్వ రెడ్డి!
నీ దొరతనము కూలిపోయె రాజా నరసిం హ్వ రెడ్డి! || దొర ||
రేనాటి సీమలోనా రెడ్డోళ్ళ కులములోనా
దొరవారీ వమిశానా ధీరుడే నరసిం హ్వ రెడ్డి || దొర ||
కొయిల్ కుంట్లా గుట్టలేంటా కుందేరూ వొడ్డులెంటా
గుర్రమెక్కీ నీవు వస్తే కుంపిణీకీ గుండె దిగులూ || దొర ||
కాలికీ సంకెండ్లు వేసీ చేతీకీ బేడీలు వేసీ
పారాతో పట్టి తెచ్చీ బందికానులొ పెట్టిరీ || దొర || (పారాతో = పహరా తో)
కండ్లకూ గంతాలు గట్టీ నోటినిండా బట్లు పెట్టీ
నిలువునా నీ తలా గొట్టీ కోట బురుజుకు గట్టీరీ || దొర ||
కాసిలో నా తల్లికేమో చావు సుద్దీ తెలిసినాదీ
కన్న కడుపే తల్లటించే గంగలోనా కలిసే || దొర || (ఆ సమయంలో నరసింహా రెడ్డి తల్లి కాశీలో ఉన్నట్లు చెబుతారు)

మూలాలు, వనరులు[మార్చు]

  1. పైకి దూకు సుప్రసిద్ధుల జీవిత విశేషాలు - జానమద్ది హనుమచ్చాస్త్రి పేజీ 50-53